Telugudesam: దొంగలకిచ్చే ప్రైజ్ ఏదైనా ఉంటే బాప్-బేటాలకు జాయింట్‌గా ఇవ్వాలి: చంద్రబాబు-లోకేశ్ పై విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

  • అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చాకే లింగమనేని గెస్ట్ హౌస్‌ జోలికి వెళ్లాలట!
  • నదిని పూడ్చి ఇళ్లు కట్టుకుంటే తప్పేమిటని వాదిస్తారా?
  • ప్రభుత్వ సంస్థలన్నింటినీ చంద్రబాబు నిర్వీర్యం చేశారు

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు విసిరారు. కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలు, గత ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్లు, చంద్రబాబు హయాంలో ప్రభుత్వ సంస్థల గురించి ప్రస్తావిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

‘లైసెన్సు లేకుండా వాహనం నడుపుతున్న వ్యక్తిని పోలీసులు అడ్డుకుంటే.. లైసెన్సు లేని వారందరిని పట్టుకున్న తర్వాతే నా దగ్గరకు రండి అన్నట్టుగా’ ఉంది చంద్రబాబు వ్యవహారం, అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చిన తర్వాతే లింగమనేని గెస్ట్ హౌస్‌ జోలికి రావాలని అల్టిమేటం ఇస్తున్నారని విమర్శించారు.

‘ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నందునే పవన విద్యుత్తును ఎక్కువ ధరకు కొన్నామంటూ చిట్టి నాయుడు మోకాలికీ బోడి గుండుకు ముడిపెడుతున్నాడు. నదిని పూడ్చి ఇళ్లు కట్టుకుంటే తప్పేమిటని వాదిస్తారు. దొంగలకిచ్చే నోబెల్ ప్రైజ్ ఏదైనా ఉంటే బాప్-బేటాలకు జాయింట్‌గా ఇవ్వాలి’ అని మరో ట్వీట్ లో చేరారు.

‘చంద్రబాబు ప్రభుత్వ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి కమీషన్ల కోసం ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించారు. సహకార డెయిరీలు, విద్యా సంస్థలు, ఆర్టీసీ, ఏపీ జెన్కో, డిస్కంలు అన్నీ దివాళా తీస్తుంటే  రోగానికి చికిత్స చేయకుండా సపట్ మలాం పూసి చల్లగా జారుకున్నారు’ అని ఇంకో ట్వీట్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

More Telugu News