Crime News: ప్రకాశం జిల్లాలో వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి!

  • చేతిపైనా, మెడపైనా తీవ్రగాయాలు
  • కొడుకుతోపాటు కలిసి ఉంటున్న దంపతులు
  • రాత్రి భోజనం ముగించి గదిలోకి వెళ్లాక ఘటన

రాత్రి భోజనం చేసి తమ గదిలోకి వెళ్లి పడుకున్న వృద్ధ దంపతులు తెల్లారేసరికి విగతజీవులుగా పడివున్నారు. వారి చేతి మణికట్టుపైనా, మెడపైనా తీవ్రగాయాలు ఉండడంతో వారు ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరైనా హత్య చేశారా? అన్న అనుమానం నెలకొంది. ఈరోజు ఉదయం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.

ప్రకాశం జిల్లా దర్శి మండలం అద్దంకి రోడ్డులో సాయిబాబా గుడి సమీపంలో అన్నపురెడ్డి వెంకటరెడ్డి(70), ఆదెమ్మ(55) దంపతులు కొడుకుతోపాటు నివాసముంటున్నారు. వెంకటరెడ్డి మొదటి భార్యకు పిల్లలు లేకపోవడంతో ఆదెమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. నిన్నరాత్రి అంతా భోజనాలు చేశాక వృద్ధ దంపతులు ఇంటి వెనుక గదిలో పడుకున్నారు.

ఈరోజు ఉదయం తల్లిదంద్రులు ఎప్పటిలా లేవకపోవడంతో అనుమానం వచ్చిన కొడుకు వెళ్లి గది తలుపు కొట్టాడు. ఎంతకీ తీయకపోవడంతో వెనుక నుంచి వెళ్లి చూడగా తల్లిదండ్రులు రక్తపుమడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో వారు ఘటనా స్థలిని సందర్శించారు. ఇరువురి చేతి మణికట్టు వద్ద, వెంకటరెడ్డి తలకి, మెడవద్ద తెగి తీవ్ర రక్తస్రావమైనట్లు గుర్తించారు. దీంతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More Telugu News