Lovers: పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్య!

  • అనంతపురం జిల్లా యాడికి సమీపంలో ఘటన
  • బంధువుల అబ్బాయే అయినా ఉద్యోగం లేదని పెళ్లికి నిరాకరణ
  • ఇద్దరి మృతితో గ్రామంలో పెను విషాదం

బంధువుల అమ్మాయి. ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా అతనిపై మనసు పారేసుకుంది. ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. బీటెక్ వరకూ చదువుకున్నారు. తమ పెళ్లకి ఏ అడ్డూ ఉండదని భావించారు. కానీ అబ్బాయికి ఉద్యోగం లేదన్న కారణం చూపించి అమ్మాయి తరఫు వారు పెళ్లికి నిరాకరించడంతో, మనస్తాపానికి గురై, కూడబలుక్కుని విషపు గుళికలు మింగి ఇద్దరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా నగరూరులో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, గ్రామానికి చెందిన రంగనాథ్‌ చౌదరి, సరస్వతీ దంపతులకు ఓ కుమారుడు వినోద్ కుమార్ (23), కుమార్తె ఉండగా, కుమార్తె అనారోగ్యంతో మృతి చెందింది. ఉన్న ఒక్క కొడుకునీ కష్టపడి చదివించారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ మాజీ కన్వీనర్‌ వెంకటచౌదరి, సువర్ణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా, చిన్న కుమార్తె చరిత (21) చిత్తూరు జిల్లాలోని సత్యవేడులో మొబైల్‌ తయారీ కంపెనీలో పనిచేస్తోంది.

ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు, బంధుత్వం కారణంగా వినోద్, చరితలు ప్రేమలో పడ్డారు. బంధువుల ద్వారా పెళ్లి ప్రస్తావన పెద్దల వద్దకు తేగా, వారు వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఒకరిని ఒకరు విడిచి ఉండలేమని భావించిన వారు, విషపు గుళికలు మింగారు. దీన్ని గమనించిన బంధువులు వారిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.

More Telugu News