ramgopalvarma: దటీజ్‌ రామ్‌గోపాల్‌వర్మ... పబ్లిసిటీ కోసం ఆయన రూటే సెపరేటు!

  • బైక్‌ రైడింగ్‌, పోలీసుల జరిమానా అంటూ హడావుడి
  • ట్విట్టర్‌ వేదికగా మరోసారి హల్‌చల్‌
  • ఇస్మార్ట్‌ శంకర్‌ ప్రమోషన్‌ కోసమే అంటున్న సినీ జనాలు

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ రూటే సెపరేటు. తనకు కావాల్సిన దానికి, అనుకున్న దానికి తెలివిగా ప్రమోషన్‌ ఇప్పించుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. అది వివాదమా, విమర్శా, మరొకటా...కారణం ఏదైనా ఆయన సృష్టించిన అలజడితో పిచ్చ పబ్లిసిటీ తెప్పించుకోవడం ఖాయం.

తాజాగా బైక్‌పై ట్రిపుల్‌ రైడింగ్‌, జరిమానా అంటూ హడావుడి ఈ కోవలోదే అంటున్నారు సినీ జనాలు. గత కొన్నాళ్లుగా సరైన విజయం లేక నిరాశలో ఉన్న తన శిష్యుడు పూరిజగన్నాథ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ’ఇస్మార్ట్‌ శంకర్‌‘ సినిమాకు పబ్లిసిటీ తెప్పించేందుకు కూడా ఆయన ఇదే మార్గాన్ని ఎంచుకున్నారన్నది టాలీవుడ్‌ టాక్‌.

గత రెండు రోజులుగా ట్విట్టర్‌ వేదికగా హంగామా సృష్టిస్తున్న రామ్‌గోపాల్ వర్మ ఇందుకోసం హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులను సైతం వదల్లేదు. జనం మాట్లాడుకోవాలంటే డిఫరెంట్‌గా ఉండాలని భావించి మోటారు సైకిల్‌పై హెల్మెట్‌ లేకుండా ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తూ వెళ్లడమే కాదు ఆ సందర్భంగా తీసిన ఫొటోను ట్యాగ్‌ చేసి మరీ ట్విట్టర్‌లో ఉంచారు.

దీంతో పోలీసులు బైక్‌ యజమానికి వెయ్యి రూపాయలు ఫైన్‌ విధిస్తూ చలానా జారీ చేశారు. ఈ ఫొటో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. పబ్లిసిటీ కోసం ఎప్పుడూ ఎవరో ఒకరిని వాడుకునే వర్మ ఈసారి ట్రాఫిక్‌ పోలీసులను టార్గెట్‌ చేశాడని చెప్పుకుంటున్నారు.

More Telugu News