priyanka chopra: భర్త, తల్లితో కలిసి దమ్ముకొడుతూ కనిపించిన నటి ప్రియాంక చోప్రా.. ఫైరవుతున్న నెటిజన్లు!

  • మయామీలో పొగతాగుతూ ఎంజాయ్ చేసిన ప్రియాంక
  • గతంలో ధూమపానం ఆరోగ్యానికి హానికరమంటూ నీతి సూత్రాలు
  • తాను ఐదేళ్లప్పుడే ఆస్తమా బారిన పడ్డానన్న నటి

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నెటిజన్లకు దొరికిపోయింది. ఫ్లోరిడాలోని మయామీలో భర్త నిక్ జోనాస్, తల్లి మధుచోప్రాతో కలిసి బహిరంగంగా ధూమపానం చేస్తున్న ప్రియాంక ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతేడాది ఆస్తమా రోగుల కోసం నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రియాంక మాట్లాడుతూ.. తాను ఐదేళ్లప్పుడే ఆస్తమాతో బాధపడ్డానని, అయినప్పటికీ ఆ వ్యాధి తన కలలను అడ్డుకోలేకపోయిందని చైతన్యం నింపే మాటలు చెప్పింది. అలాగే, ధూమపానం ఆరోగ్యానికి హానికరమని, దీపావళిని దీపాలతోనే జరుపుకోవాలని, పటాసులు కాల్చి కాలుష్యాన్ని సృష్టించొద్దంటూ హితవు పలికింది.

ఇప్పుడామె మాటలను గుర్తు చేస్తూ నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. ఆమె మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదని మండిపడుతున్నారు. నాటి నీతి సూత్రాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. విపరీత కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు. ప్రియాంక ఆస్తమా నివారణకు కృషి చేస్తోందని ఒకరంటే.. ప్రియాంక ఆస్తమాతో బాధపడుతోందని, దీపావళి నాడు ఎవరూ టపాసులు కాల్చొద్దని మరొకరు సెటైర్ వేశారు. ఆస్తమా రోగులు దయచేసి ఈ ఫొటో చూడొద్దంటూ ఇంకొకరు కామెంట్ చేశారు. స్వరభాస్కర్ నుంచి ప్రియాంక వరకు బాలీవుడ్ మొత్తం నకిలీ మనుషులతో నిండిపోయిందని, ఇది ఎప్పటికీ అంతం కాదని మరో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

More Telugu News