Hyderabad: సినిమా చూపిస్తామని నమ్మించి బాలికపై అత్యాచారం.. నిందితులను చావబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు

  • సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • సినిమాకు సమయం ఉందని భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారం
  • బాలిక కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు

సినిమా పేరుతో బాలికను ఆశపెట్టి తీసుకెళ్లి ఆపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌ ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ పరిధిలోని మురికివాడకు చెందిన పదకొండేళ్ల బాలిక ప్రభుత్వ హాస్టల్‌లో ఉండి చదువుకుంటోంది. ఆమె తండ్రి ఇటీవలే మరణించగా, తల్లి మద్యానికి బానిసైంది. శనివారం హాస్టల్ నుంచి ఇంటికొచ్చిన బాలిక పెద్దమ్మ ఇంటి వద్ద మరో బాలికతో కలిసి ఆడుకుంటోంది.

వారింటి పక్కనే నివసించే ఇస్లావత్‌ దస్రు (23) అనే యువకుడు వారిని చూసి సినిమాకు తీసుకెళ్తానని ఆశపెట్టాడు. చెత్త వ్యాపారం చేసే కేతావత్‌ మోతీలాల్‌ (30)తో కలిసి బైక్‌పై సరూర్‌నగర్‌-గడ్డిఅన్నారం మార్గంలోని ఓ సినిమా థియేటర్‌ వద్దకు చేరుకున్నారు. అయితే, సినిమా వేయడానికి ఇంకా సమయం ఉందని చెప్పి ఎదురుగా నిర్మాణంలో ఉన్న భవనంలోకి బాలికలను తీసుకెళ్లారు. 11 ఏళ్ల బాలికపై ఇస్లావత్‌ దస్రు తొలుత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మోతీలాల్ సిద్ధమవుతుండగా మరో బాలిక కేకలు వేసింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు నిందితులను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News