Hyderabad: బంజారాహిల్స్ లో బంజారా లేదు హిల్సూ లేవు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • హైదరాబాద్ ఒకప్పుడు ప్రకృతి అందాలతో ఉండేది
  • జూబ్లీ హిల్స్ లో జూబ్లీ ఉంది గానీ, హిల్స్ లేవు
  • ప్రకృతి పరిరక్షణకు అందరూ పాటుపడాలి 

ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్, నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా వద్ద ‘సేవ్ అవర్ జియో హెరిటేజ్’ వాక్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రకృతి పరంగా హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. ఈరోజున మానవ సమాజం అత్యాశకు పోయి ప్రకృతిని ధ్వంసం చేస్తోందని అన్నారు. ప్రకృతి గురించి, భావి మానవ సమాజం గురించి ఆలోచన చేయని దౌర్భాగ్యపు స్థితి ప్రపంచంలో ఉందని అన్నారు.

హైదరాబాద్ నగరం విషయానికొస్తే గతంలో బంజారాహిల్స్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు గుట్టలు, ప్రకృతి అందాలతో ఉండేవని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు చూస్తే, బంజారాహిల్స్ లో బంజారా లేదు హిల్సూ లేవని, జూబ్లీ హిల్స్ లో జూబ్లీ ఉంది గానీ, హిల్స్ లేవని, ఈ పరిస్థితి చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రకృతి పరిరక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పాటుపడాలని, ప్రజలు చైతన్య వంతులు కావాలని ఆకాంక్షించారు.

More Telugu News