Crypto Currency: బిట్ కాయిన్ తరహా క్రిప్టో కరెన్సీ వినియోగంపై స్పష్టతనిచ్చిన కేంద్రం

  • క్రిప్టో కరెన్సీలపై నిషేధం లేదన్న కేంద్ర ఆర్థికశాఖ
  • బిట్ కాయిన్ అంశంలో బ్యాంకులకు హెచ్చరికలు చేసిన ఆర్బీఐ
  • సిద్ధమవుతున్న ముసాయిదా బిల్లు

బిట్ కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీ విధానాలపై కేంద్ర ప్రభుత్వం తమ వైఖరి వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో క్రిప్టో కరెన్సీపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది. అయితే, ఆర్బీఐ, ఈడీ, ఐటీ వంటి ఆర్థిక సంబంధ వ్యవస్థలు క్రిప్టో కరెన్సీపై వారి నియమావళికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరణ ఇచ్చారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఆయన పైవిధంగా బదులిచ్చారు. ఇప్పటికైతే, క్రిప్టో కరెన్సీ నియంత్రణకు, క్రిప్టో కరెన్సీ వినియోగంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి ఎలాంటి చట్టం లేదని మంత్రి స్పష్టం చేశారు.

క్రిప్టో కరెన్సీపై కేంద్రం తీసుకువచ్చిన ముసాయిదా బిల్లు కార్యరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక కార్యకలాపాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్రగార్గ్ పేర్కొనగా, ఆ బిల్లు సిద్ధం కానందునే క్రిప్టో కరెన్సీపై ఎలాంటి నిషేధాజ్ఞలు విధించలేదని మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. కాగా, గతేడాది బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలతో లావాదేవీలు చేసే సంస్థలకు సేవలు నిలిపివేయాలంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకురాదలచిన ముసాయిదా బిల్లు కార్యరూపం దాల్చితే, క్రిప్టో కరెన్సీలతో లావాదేవీలు జరిపిన వాళ్లకు 10 ఏళ్ల నాన్ బెయిలబుల్ జైలుశిక్ష తప్పదు.

More Telugu News