Sheela Dixit: షీలా దీక్షిత్ మృతి పట్ల రాష్ట్రపతి కోవింద్, రాహుల్ గాంధీ ప్రగాఢ సంతాపం

  • అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన షీలా దీక్షిత్
  • ఢిల్లీకి కొత్తరూపునిచ్చారంటూ కితాబిచ్చిన రామ్ నాథ్ కోవింద్
  • కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ అంటూ కీర్తించిన రాహుల్ గాంధీ

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయవేత్త షీలా దీక్షిత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. షీలా దీక్షిత్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త వినాల్సి రావడం విచారకరమని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిరకాలం గుర్తుంచుకునే రీతిలో ఢిల్లీకి కొత్త రూపునిచ్చారని కోవింగ్ కితాబిచ్చారు. ఈ విషాద సమయంలో షీలా దీక్షిత్ కుటుంబసభ్యులకు, అనుయాయులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు.

అటు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా షీలా దీక్షిత్ మృతి పట్ల స్పందించారు. షీలా జీ మృతి వార్త వినాల్సి రావడం ఎంతో బాధాకరమైన విషయం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆమె ముద్దుబిడ్డ అని కీర్తించారు. ఆమెతో తనకు వాత్సల్యపూరితమైన అనుబంధం ఉందని రాహుల్ గుర్తుచేసుకున్నారు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించి నిస్వార్థమైన రీతిలో ఢిల్లీకి సేవలు అందించారని కొనియాడారు. షీలా దీక్షిత్ కుటుంబసభ్యులకు, ఢిల్లీ ప్రజలకు సానుభూతి తెలిపారు.

More Telugu News