Uttar Pradesh: భారత్‌లో ఉండేందుకు మేము కప్పం కడుతున్నాం: యూపీ ఎంపీ ఆజంఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

  • స్వాతంత్య్రానంతరం నుంచి జరుగుతున్నది ఇదే
  • ఈ దేశంలో ఉండాలనుకున్నందుకు చెల్లిస్తున్న మూల్యం ఇది
  • గతంలోనూ పలుసార్లు ఇలాంటి వ్యాఖ్యలే చేసిన ఖాన్

దేశ విభజన అనంతరం భారత్‌లో ఉండాలని నిర్ణయించుకున్న ముస్లింలు అప్పటి నుంచి కప్పం కట్టి ఇక్కడ జీవిస్తున్నారని ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విభజన సందర్భంగా మా పూర్వీకుల్లో చాలామంది పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ (ఉమ్మడి పాకిస్థాన్‌)కు వెళ్లిపోయారని, ఇక్కడే ఉండాలనుకున్న తమలాంటి వారు మాత్రం అందుకు తగిన శిక్ష అనుభవిస్తున్నారని వివాదాస్పద నేత ఆజంఖాన్‌ అన్నారు.

బీహార్‌ లోని సరాన్‌ జిల్లాలో గేదెను దొంగిలించారన్న ఆరోపణలపై జరిగిన సామూహిక దాడిలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. దొంగతనం చేయకపోయినా, కావాలనే కొట్టి చంపారని బంధువులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ వివాదంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగుతోంది.

ఈ ఘటనపై స్పందించిన ఆజంఖాన్‌ ఇలా వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆయన మాటలు దేశ సమగ్రతకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పటికే ఆజంఖాన్‌పై 30కి పైగా కేసులు నమోదయి ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ల్యాండ్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో పలువురిపై కేసులు నమోదు చేసింది. మాఫియా నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఆజంఖాన్‌ కూడా ఉన్నారు. ఈ కేసుల్లో ప్రాథమిక సమాచారం లభిస్తే ఆయనను అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని ఒక పోలీసు అధికారి తెలిపారు.

More Telugu News