Yadadri Bhuvanagiri District: క్లాస్ లీడర్ పోటీలో అమ్మాయి ఓడించిందని బాలుడి ఆత్మహత్య!

  • యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
  • ఎనిమిదో తరగతి చదువుతున్న సాయి చరణ్
  • పోటీలో ఓడిపోయి మనస్తాపంతో ఆత్మహత్య

క్లాసులో లీడర్ ఎన్నికల్లో తనను ఓ అమ్మాయి ఓడించిందన్న మనస్తాపంతో బాలుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, రామన్నపేటలోని కృష్ణవేణి పాఠశాలలో సాయి చరణ్ అనే విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. గత వారంలో క్లాస్ లీడర్ ఎంపిక నిమిత్తం పోటీలు జరిగాయి.

ఈ ఎన్నికల్లో సాయి చరణ్ నిలబడగా, విద్యార్థులంతా పోటీలో నిలిచిన మరో అమ్మాయిని గెలిపించారు. తోటి అమ్మాయి చేతిలో ఓడిపోయానన్న మనస్తాపంతో నిన్న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయాడు సాయి చరణ్. అతని కోసం వెతుకుతుంటే, పట్టణ శివార్లలోని రైలు పట్టాలపై అతని మృతదేహం కనిపించింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొనగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

More Telugu News