mohammed shami: టీమిండియా క్రికెటర్ షమీపై గృహ హింస కేసు.. 25న విచారించనున్న అలహాబాద్ హైకోర్టు

  • గతేడాది మార్చిలో షమీపై ఆరోపణలు
  • శారీరకంగా, మానసికంగా వేధించారంటూ పోలీసులకు ఫిర్యాదు
  • షమీ ఒత్తిడితో పోలీసులు తనను వేధించారన్న హసీన్

గృహ హింస ఆరోపణలు ఎదుర్కొంటున్న టీమిండియా పేసర్ మహ్మద్ షమీ కేసును ఈ నెల 25న అలహాబాద్ హైకోర్టు విచారించనుంది. తనను మానసికంగా, శారీరకంగా హింసించడమే కాకుండా అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు కూడా పెట్టుకున్నాడని అతడి భార్య హసీన్ జహాన్ గతేడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదుతో స్పందించి షమీపై చర్యలు తీసుకోవాల్సిన అమ్రోహాలోని దిడౌలీ పోలీసులు తిరిగి తననే విచారణ పేరిట వేధించారని హసీన్ జహాన్ అలహాబాద్ హైకోర్టులో ఫిర్యాదు చేసింది.

అర్ధ రాత్రివేళ తన పనిమనిషిని, కుమార్తెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వేధించారని ఆరోపించింది. షమీ ఒత్తిడితోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. కేసును స్వీకరించిన కోర్టు 25న విచారించనున్నట్టు పేర్కొంది. కాగా, వివాహేతర సంబంధాలు పెట్టుకున్న తన భర్త షమీ, అతడి కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని గతేడాది మార్చిలో హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసింది.  

More Telugu News