Hyderabad: బ్రిడ్జిపై నుంచి దూకబోయిన వ్యక్తి.. రక్షించిన సినీ నటుడు ఇంద్రసేన

  • అత్తాపూర్ ఫ్లై ఓవర్‌పై ఘటన
  • దూకితే మోదీ స్కార్పియో ఇస్తారన్న యువకుడు
  • మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తింపు

బ్రిడ్జి పైనుంచి దూకితే మోదీ స్కార్పియో ఇస్తారని పేపర్లో చదివానని, అందుకే బ్రిడ్జి పైనుంచి దూకేస్తున్నానంటూ హైదరాబాద్, అత్తాపూర్‌ బ్రిడ్జిపై ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. గురువారం ఉదయం పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫ్లై ఓవర్ పైనుంచి దూకేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని కిందినుంచి కొందరు వారించారు. ఆ పక్కనే ఉన్న సెలబ్రిటీ జిమ్‌లో ఉన్న సినీ నటుడు ఇంద్రసేన సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ వ్యక్తిని కాపాడాడు. జిమ్‌లో ఉన్న ఇతర యువకులను అప్రమత్తం చేశాడు. మరో యువకుడితో కలిసి వెనక నుంచి వెళ్లి కిందకిలాగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఉత్తరాదికి చెందిన వ్యక్తిగా ఆ  యువకుడిని గుర్తించారు. బ్రిడ్జిపై నుంచి ఎందుకు దూకాలనుకుంటున్నావన్న ప్రశ్నకు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. పైనుంచి దూకితే మోదీ స్కార్పియో ఇస్తారని పేపర్లో చదివానని, అందుకే దూకాలనుకున్నానని చెప్పాడు. అయితే, అతడికి మతిస్థిమితం సరిగా లేదని గుర్తించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు.

More Telugu News