TRS: ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను చెప్పుతో కొట్టిన మహిళా నేత

  • బైక్‌పై ట్రిపుల్ రైడింగ్
  • వీడియో తీసిన ట్రాఫిక్ కానిస్టేబుల్
  • కుటుంబ సభ్యులతో వచ్చి దాడిచేసిన టీఆర్ఎస్ నేత

ట్రిపుల్ రైడింగ్‌తో వెళ్తున్న బైక్‌‌ను వీడియో తీసిన కానిస్టేబుల్‌పై టీఆర్ఎస్ మహిళా నేత తన కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం హైదరాబాద్, జియాగూడకు చెందిన మహమ్మద్ గౌస్, మరో ఇద్దరితో కలిసి బైక్‌పై మౌలాలి కమాన్‌వైపు వెళ్తున్నాడు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ముజఫర్ ఇది గుర్తించాడు. ట్రిపుల్ రైడింగ్ నేరం కావడంతో వీడియో తీశాడు.

ఆ తర్వాత కాసేపటికి మౌలాలి, షాదుల్లానగర్‌కు చెందిన టీఆర్ఎస్ మహిళా నేత, వార్డు సభ్యురాలు సయ్యద్ మహ్మద్ బేగం, ఆమె భర్త సయ్యద్‌ గఫార్, కుమారుడు సయ్యద్ సిద్దిఖ్ హుస్సేన్, బంధువు మహమ్మద్‌ మజీద్‌లతో కలిసి వచ్చిన గౌస్ కానిస్టేబుల్‌పై దాడికి దిగారు. టీఆర్ఎస్ నేత అయిన మహ్మద్ బేగం కానిస్టేబుల్‌ను ఎడమకాలి చెప్పుతో కొట్టింది. మరోసారి ఇలాంటి పనులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News