Karnataka: ఆ లేఖపై నాకు అనుమానాలు ఉన్నాయి: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్

  • శ్రీమంత్ పాటిల్ పేరుతో నాకో లేఖ వచ్చింది
  • ఈ లేఖను లెటర్ హెడ్ పై రాయలేదు
  • ఆ లేఖలో తేదీ కూడా వేయలేదు

తమ ఎమ్మెల్యేలు కిడ్నాప్ అయ్యారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య తనకు రాసిన లేఖ గురించి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ ప్రస్తావించారు. ఈ కిడ్నాప్ వ్యవహారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీమంత్ పాటిల్ పేరుతో తనకు ఓ లేఖ వచ్చిందని, తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతున్నానని, ఆసుపత్రిలో ఉన్నానని, అందుకే, అసెంబ్లీకి రాలేకపోతున్నట్టు ఆ లేఖలో ఆయన పేర్కొన్నారని అన్నారు. అయితే, ఈ లేఖను లెటర్ హెడ్ పై రాయలేదని, తేదీ కూడా వేయలేదని చెప్పారు.

ఈ లేఖను తాను నమ్మలేనని, దీనిపై తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. పాటిల్ గురించి ఆరా తీయాలని, ఆయన కుటుంబాన్ని తక్షణం సంప్రదించాలని స్పీకర్ ఆదేశించారు. రేపటిలోగా తనకు ఓ నివేదిక ఇవ్వాలని హోం మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ పాటిల్ కు హోం శాఖ రక్షణ కల్పించకపోతే తానే డీజీపీతో స్వయంగా మాట్లాడతానని స్పీకర్ చెప్పడం గమనార్హం.

కాగా, విశ్వాసపరీక్ష సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్-జేడీఎస్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. కలిసి బయలుదేరిన తమ ఎమ్మెల్యేలు ఎనిమిది మందిలో ఒకరైన శ్రీమంత్ పాటిల్ ఆసుపత్రిలో చేరారని, మిగిలిన వారు కనిపించకుండా పోయారని కాంగ్రెస్ సభ్యుడు డీకే శివకుమార్ స్పీకర్ దృష్టికి తెచ్చారు. 

More Telugu News