Chandrababu: చంద్రబాబు హైటెన్షన్ వైర్ లాంటి వ్యక్తి.. పట్టుకోవాలని చూస్తే బూడిదైపోతారు: బాబూ రాజేంద్రప్రసాద్

  • మేము నిప్పులాంటి వాళ్లం
  • చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వం ఏ తప్పూ చేయలేదు
  • తప్పు చేస్తే నిరూపించండి

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు హయాంలో కుదుర్చుకున్న పీపీఏలలోను, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి వాటిలోను అవినీతి జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను టీడీపీ నేతలు తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు హైటెన్షన్ వైర్ లాంటి వ్యక్తి అని, ఆయన్ని పట్టుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే షాక్ కొట్టి బూడిదైపోతారని అన్నారు.

టీడీపీ హయాంలో కుదుర్చుకున్న పీపీఏల్లో ఎలాంటి అవకతవకలు లేవని, తమను వ్యతిరేకించే బీజేపీ ప్రభుత్వమే స్పష్టం చేసిందని, ఇంత కన్నా ఇంకేమి నిదర్శనం కావాలని అన్నారు. చంద్రబాబు హయాంలో ఏపీకి నాలుగు వేల ఐదు వందల పరిశ్రమలు వచ్చాయని, తద్వారా సుమారు ఐదు లక్షల పదహారు వేల మందికి ఉపాధి లభించిందని సాక్షాత్తూ జగన్ ప్రభుత్వమే చెప్పిందని అన్నారు. ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలే విభేదించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ‘మేము నిప్పులాంటి వాళ్లం. మా చంద్రబాబునాయుడుగారు, తెలుగుదేశం ప్రభుత్వం, అప్పటి మా మంత్రులు ఏ తప్పూ చేయలేదు. చేస్తే..నిరూపించండి’ అని వైసీపీ నేతలకు బాబూ రాజేంద్ర ప్రసాద్ సవాల్ విసిరారు.

More Telugu News