Telangana: బీజేపీని సీరియస్ గా తీసుకోవద్దంటూనే కేసీఆర్ వణికిపోతున్నారు: ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా

  • కేసీఆర్ ది మేకపోతు గాంభీర్యం
  • బీజేపీ ఎంపీలు నలుగురే గెలిచారని ఎగతాళి చేస్తారా?
  • ఆ నలుగురే టీఆర్ఎస్ ను గద్దె దించుతారు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని సీరియస్ గా తీసుకోవద్దంటున్న కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, తమ పార్టీని, ప్రధాని మోదీని చూస్తే వణికిపోతున్నారని విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు నలుగురే గెలిచారంటూ ఎగతాళిగా మాట్లాడుతున్న కేసీఆర్ ఓ విషయం గుర్తుంచుకోవాలని, ఆ నలుగురు ఎంపీలే  టీఆర్ఎస్ ను గద్దె దించుతారని వ్యాఖ్యానించారు.

సార్వత్రిక ఎన్నికల్లో తన కూతురుని గెలిపించుకోలేని కేసీఆర్ ఇంకా పార్టీని ఏం కాపాడతారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీని కూలగొట్టాలన్న నిర్ణయం సబబు కాదని అన్నారు. మున్సిపల్ ఎన్నికల గురించి ఆయన మాట్లాడుతూ, ఈ విషయంలో టీఆర్ఎస్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఓటర్లను మారుస్తున్నారని, ఓటర్ల జాబితా సరిగా లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ తమకు అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకుని హడావుడిగా ఎన్నికలు నిర్వహించడం సరికాదని అన్నారు. అందరినీ కేసీఆర్ భయపెడుతున్నారని, ఆయనకు దమ్మూధైర్యం ఉంటే మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని సవాల్ విసిరారు.

More Telugu News