Andhra Pradesh: ఇదిగోండి.. మా హయాంలో వచ్చిన 5.6 లక్షల ఉద్యోగాలివే.. వివరాలు ప్రకటించిన నారా లోకేశ్!

  • త్వరలోనే మరో 8 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి
  • ఈ ఘనత తమదేనని వైసీపీ నేతలు చెప్పుకుంటారేమో?
  • చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు రాలేదని అబద్ధాలు చెప్పారు

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ కల్పన జరగలేదని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను నారా లోకేశ్ తిప్పికొట్టారు. టీడీపీ హయాంలో వచ్చిన 5.60 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన సాక్ష్యాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాబోయే రోజుల్లో మరో 8 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు. దీన్ని కూడా వైసీపీ నేతలు తమ ఘనతగా చెప్పుకునే ప్రమాదముందని దుయ్యబట్టారు. ‘ఇలానే ఎలక్ట్రానిక్స్, ఇంకా ఇతర రంగాల్లో మేమిచ్చిన ఉద్యోగాలు, ఏర్పాటవుతున్న కంపెనీలు, రాబోయే ఉద్యోగాల వివరాలు కూడా బయటపెట్టి, మీ పత్రిక అసత్యాల సాక్షి అని ప్రజలందరికీ తెలియజేయాలని జగన్ గారిని కోరుతున్నాను.

చంద్రబాబుగారి హయాంలో 39,450 పరిశ్రమలు ఏర్పాటు చేసి 5,13,351 మందికి ఉద్యోగాలు వచ్చినట్లు  జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. ఐటీ రంగంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులతో 175 కంపెనీల ద్వారా 30,428 మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. పాదయాత్రలో ఒక్క నిజం కూడా మాట్లాడని జగన్ గారు, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నిజాలు ఒప్పుకుంటున్నందుకు ధన్యవాదాలు. 'జాబు రావాలి అంటే బాబు పోవాలి', 'బాబు హయాంలో ఒక్క జాబు కూడా రాలేదు' ఇలాంటి ఎన్నో అబద్దాలను పాదయాత్రలో చెప్పారు జగన్ గారు’ అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News