Madhya Pradesh: పాముకాటుకు గురైన మహిళకు ఆసుపత్రిలో నగ్నమంత్రం.. అమానవీయ ఘటన!

  • మధ్యప్రదేశ్ లో అమానవీయ ఘటన
  • పురుషుల వార్డు ముందు మహిళ బట్టలూడదీయించిన మంత్రగాడు
  • చూసినా ఏమీ అనలేని పరిస్థితిలో సిబ్బంది

కంప్యూటర్ యుగంలోనూ ప్రజలింకా మూఢ నమ్మకాలు వదల్లేదనడానికి ఇదో తాజా ఉదాహరణ. మధ్యప్రదేశ్‌ లో ఓ యువతి పాము కాటుకు గురికాగా, ఆసుపత్రిలో చేరిన ఆమెకు నయం చేయాలంటే భూత వైద్యుడు రావాల్సిందేనని చెప్పి, ఓ మంత్రగాడిని కుటుంబ సభ్యులు పిలిపించారు. డాక్టర్ల వైద్యం వద్దంటూ, ఆసుపత్రి ఆవరణలోనే తాంత్రిక పూజలు చేశారు. విషం పోవాలంటే, నగ్నంగా ఉండాలంటూ, ఆమె ఒంటిపై దుస్తులు ఊడదీసి అవమానించారు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఆసుపత్రి సిబ్బంది చూస్తూనే ఉన్నా, ఏమీ చేయలేని పరిస్థితి. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దామో జిల్లాలోని భతియాగర్ గ్రామానికి చెందిన ఇమ్రాత్ దేవి (25)ని పాము కరువగా, చికిత్స కోసం ఆమె దామో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. మహిళా వార్డులో ఆమె చికిత్స పొందుతుండగా, బంధువులు ఓ మంత్రగాడిని తెచ్చి వైద్యం చేయించే ప్రయత్నం చేశారు. ఆపై ఆమె చేత పురుషుల వార్డు బయట బట్టలు విప్పించారు. మంత్రగాడు కొన్ని మంత్రాలు చదువుతూ తన పని తాను చేసుకుపోయాడు. దీనిపై ఉన్నతాధికారులు మాట్లాడుతూ, ఓ నర్సు ఈ ఘటనను చూసిందని, కానీ ఆమె డాక్టర్లకు,సెక్యూరిటీ గార్డుకి సమాచారమివ్వలేదని అన్నారు. రోగులకు, వారి కుటుంబ సభ్యులకి మంత్రాలపై కౌన్సెలింగ్ ఇస్తున్నా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉండటం దురదృష్టకరమని అన్నారు.

More Telugu News