Anantapur District: అనంతపురంలో దారుణం: వివాహితను బెదిరించి ఏడాదిగా సామూహిక అత్యాచారం

  • భర్తను చంపేస్తామని బెదిరించి లొంగదీసుకున్న నిందితులు
  • ఇటీవల మరింత మితిమీరిన ఆగడాలు
  • పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఏడాదిగా ఓ వివాహితపై జరుగుతున్న దారుణం వెలుగులోకి వచ్చింది. రకరకాలుగా బెదిరించి వివాహితను లొంగదీసుకున్న నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల వారి వేధింపులు మరింత ఎక్కువ కావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ అకృత్యం వెలుగులోకి వచ్చింది.

రాయదుర్గానికి చెందిన దంపతులు చేతివృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారు. పాలకోసం రోజూ తన వద్దకు వస్తున్న బాధిత మహిళతో వ్యాపారి పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఫేస్‌బుక్ ద్వారా ఆమె వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిన వ్యాపారి ఆమెకు మరింత చేరువయ్యాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను రికార్డు చేసి ఆమె భర్తకు చెబుతానని బెదిరించి లొంగదీసుకున్నాడు.

అప్పటి నుంచీ ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యాపారి తన ముగ్గురు స్నేహితులకు కూడా ఆమెను పరిచయం చేశాడు. వారు కూడా బాధితురాలిని బెదిరించి దారుణానికి పాల్పడ్డారు. ఆమె భర్తను చంపేస్తామని, ముఖంపై యాసిడ్ పోస్తామని బెదిరిస్తూ ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇటీవల వారి వేధింపులు మరింత ఎక్కువ కావడంతో విషయం భర్త దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.  

More Telugu News