Narendra Modi: పార్లమెంట్ కు డుమ్మా కొడుతున్న మంత్రులపై ప్రధాని సీరియస్!

  • గైర్హాజరు అవుతున్న వారి పేర్లు ఇవ్వండి
  • సాయంత్రానికి తనకు అందాలన్న మోదీ
  • బాధ్యత  కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిపై

పార్లమెంట్ సమావేశాలు సాగుతున్న సమయంలో సభకు హాజరుకాని మంత్రులపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ అయ్యారు. నేడు పార్లమెంట్ కు డుమ్మా కొట్టిన అందరి పేర్లనూ తనకు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ప్రతిరోజూ సాయంత్రానికి సభకు రాని వారి పేర్లన్నీ తనకు అందించాలని మోదీ ఆదేశించారు.

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగగా, గైర్హాజరైన వారి పేర్లతో పాటు పార్లమెంట్ డ్యూటీలను సక్రమంగా పాటించని ఎంపీల వివరాలనూ తనకు ఇవ్వాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి మోదీ సూచించారు. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధీ, రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ, సభకు హాజరై, ప్రజా సమస్యలను చర్చించాలని ఈ సందర్భంగా మోదీ కోరారు.

దేశంలో పలు ప్రాంతాల్లో తాగునీటి కొరత ఉన్నట్టు తెలుస్తోందని, ఆయా నియోజకవర్గాలకు చెందిన మంత్రులు, ఎంపీలు సమస్య పరిష్కారానికి క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఆదేశించారు. ఇందుకోసం స్థానిక అధికారుల సహాయాన్ని తీసుకోవాలని సూచించారు.

More Telugu News