Kangana Ranaut: బాలీవుడ్ ప్రముఖులపై మాట్లాడినందుకు నాపై తీవ్రంగా దాడి చేస్తున్నారు: కంగనా రనౌత్

  • హృతిక్, కరణ్ లపై మాట్లాడిన తర్వాతే మీడియా నన్ను టార్గెట్ చేసింది
  • రెండు, మూడేళ్లుగా నాపై దాడి జరుగుతోంది
  • ఎంతో ఒత్తిడికి గురవుతున్నా

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు, జర్నలిస్టులకు మధ్య ఓ రేంజ్ లో యుద్ధం జరుగుతున్న సంగతి తెలిపిందే. ఇదే అంశంపై ఓ మీడియా సంస్థతో కంగనా మాట్లాడుతూ, మరోసారి మీడియాపై మండిపడింది. బాలీవుడ్ ప్రముఖులైన హృతిక్ రోషన్, కరణ్ జొహార్ లాంటి వారికి వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుంచి జర్నలిస్టులు తనపై దాడులకు పాల్పడుతున్నారని చెప్పింది. ఇటీవల కాలంలో తనపట్ల మీడియా వ్యవహరిస్తున్న తీరును చూస్తే... బాలీవుడ్ ప్రముఖులను తాను విమర్శించినప్పటి నుంచి మీడియా తనను టార్గెట్ చేసిందనే విషయం అర్థమవుతుందని తెలిపింది. ముంబై మీడియాలో ఎక్కువ భాగం ఓ గ్రూపుగా ఏర్పడి తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడింది.

తనకు వ్యతిరేకంగా ఎన్నో కథనాలను ప్రచురిస్తున్నారని కంగనా ఆవేదన వ్యక్తం చేసింది. గత రెండు, మూడేళ్లుగా ఇది కొనసాగుతోందని చెప్పింది. మీడియా వ్యవహారశైలితో తాను విసిగిపోయానని తెలిపింది. తనపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారం వల్ల తాను చాలా ఒత్తిడికి గురవుతున్నానని... ఈ నేపథ్యంలోనే తాను తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించానని చెప్పింది. ఇదంతా లేకపోతే, తాను కూడా చాలా ప్రశాంతంగా ఉండేదాన్నని తెలిపింది. మీడియాలో కూడా తనకు చాలా మంది మంచి మిత్రులు, సలహాదారులు ఉన్నారని చెప్పుకొచ్చింది.

కరణ్ జొహార్ తో కంగనాకు 2017లో గొడవ ప్రారంభమైంది. కరణ్ హోస్ట్ చేస్తున్న 'కాఫీ విత్ కరణ్' చాట్ షోలో అతనిపైనే కంగనా విమర్శలు గుప్పించింది. ఇండస్ట్రీలో బయటవారిని కరణ్ సహించలేడని... స్టార్ కిడ్స్ నే ప్రోత్సహిస్తాడని విమర్శించింది.

హృతిక్ రోషన్ తో గొడవ విషయానికి వస్తే.... హృతిక్ తన మాజీ ప్రియుడు అని కంగనా వ్యాఖ్యానించింది. దీన్ని హృతిక్ ఖండించాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకునేంత వరకు పరిస్థితి వెళ్లింది. ఇప్పటికీ వీరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది.

More Telugu News