Tirumala: తిరుమలలో కలకలం... యువతిపై దాడి చేసిన ఎలుగుబంటి!

  • ఆహారం లభించక బయటకు వస్తున్న వన్యప్రాణులు
  • గోగర్భం డ్యామ్ వద్ద మహబూబ్ నగర్ యువతిపై ఎలుగు దాడి
  • అశ్విని ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్న డాక్టర్లు

తిరుమల గిరుల్లోని వన్య ప్రాణులు ఆహారం లభించక, బయటకు వచ్చి, భక్తులపై దాడి చేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో చిరుతపులుల దాడులు పెరుగగా, తాజాగా, ఎలుగుబంట్లు సైతం దాడులకు దిగుతున్నాయి. తిరుమలకు వచ్చిన ఓ యువతి, గోగర్భం డ్యామ్ లో స్నానం చేసి వస్తుండగా, ఎలుగుబంటి దాడి చేసింది.

వివరాల్లోకి వెళితే, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విజయలక్ష్మి (26), హైదరాబాద్ లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఆమె తల్లి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. హైదరాబాద్ లో తన అవసరాలకు తగినంత డబ్బులను తల్లి ఇవ్వడం లేదని అలిగిన విజయలక్ష్మి గత శుక్రవారం తిరుమలకు చేరుకుని, అప్పటి నుంచి అక్కడే ఉంటోంది.

ఈ క్రమంలో నిన్న గోగర్భం డ్యామ్ వద్దకు వెళ్లిన ఆమె, స్నానానంతరం అడవి వైపు వెళ్లగా, అక్కడే కాచుకుకూర్చున్న ఎలుగు దాడి చేసింది. ఈ ఘటనలో గాయాలపాలైన ఆమె, కేకలు వేస్తూ పరుగులు పెట్టగా, గమనించిన ఇతర భక్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆమెను స్థానిక అశ్విని ఆసుపత్రికి తరలించిన అధికారులు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని డాక్టర్లు తెలిపారు.

More Telugu News