Polavaram: పోలవరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకున్నట్టు మాకు ఎలాంటి నివేదికలు రాలేదు!: కేంద్ర మంత్రి స్పష్టీకరణ

  • పోలవరంపై రాజ్యసభలో విజయసాయి ప్రశ్నల వర్షం
  • అవినీతిపై సీబీఐ విచారణ జరిపించే ఆలోచన ఉందా? అంటూ ప్రశ్న
  • విచారణకు అవకాశం లేదని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమాధానం 

పోలవరం ప్రాజెక్టులో అంతులేని అవినీతి చోటు చేసుకుందని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అవినీతిపై విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో ఈరోజు చర్చ జరిగింది.

వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పోలవరం అక్రమాలపై సీబీఐ చేత విచారణ జరిపించే ఆలోచన ఉందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణానికి ఆర్థిక శాఖ నిధులను ఎప్పుడు విడుదల చేస్తుందని అడిగారు. నిధుల విడుదల కోసం అంచనాలను ఆర్థికశాఖకు పంపకుండా... రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీకి పంపించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎస్టిమేట్స్ కమిటీ ఎప్పుడు ఆమోదం తెలుపుతుందని అడిగారు.  

విజయసాయి ప్రశ్నలకు సమాధానమిస్తూ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకున్నట్టు తమకు ఎలాంటి నివేదికలు రాలేదని ఆయన తెలిపారు. అందువల్ల సీబీఐ విచారణ జరపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ఇప్పటి వరకు 60 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని... వంద శాతం నిధులను కేంద్రమే భరిస్తుందని తెలిపారు.

More Telugu News