Andhra Pradesh: ఫైనాన్స్ కంపెనీలను చీట్ చేసిన నువ్వా ట్వీట్ చేసేది?: కేశినేనికి బుద్ధా వెంకన్న కౌంటర్

  • బస్సులపై ఫైనాన్స్ తీసుకొన్నారు
  • 1997లో సొంతంగా దొంగ రిసిప్ట్ లు తయారు చేశారు
  • నేను చెప్పాల్సిన నిజాలు వినే ధైర్యం నీకుందా?

టీడీపీ నేతలు కేశినేని నాని, బుద్ధా వెంకన్నలు పరస్పర ఆరోపణలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇద్దరు నేతలు ‘ట్విట్టర్’ వేదికగా చేసుకుంటున్న ఘాటు వ్యాఖ్యలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కేశినేనిని విమర్శిస్తూ బుద్ధా వెంకన్న చేసిన ఓ ట్వీట్ కు కేశినేని స్పందిస్తూ.. రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు తనకు అవసరం లేదని, ఇలాంటి వన్నీ గుళ్ళో కొబ్బరి చిప్పల దొంగలకి, సైకిల్ బెల్లుల దొంగలకి, కాల్ మనీ గాళ్ళకి, సెక్స్ రాకెట్ గాళ్ళకి, బ్రోకర్లకి, పైరవీదారులకే అవసరమని అన్నారు. కేశినేని చేసిన ఈ వ్యాఖ్యలకు బుద్ధా వెంకన్న మళ్లీ స్పందించారు. కేశినేనిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేశినేని ట్రావెల్స్ బస్సులపై ఫైనాన్స్ తీసుకుని ఎగ్గొట్టారని ఆరోపించారు.

‘బస్సులపై ఫైనాన్స్ తీసుకొని.. 1997లో సొంతంగా దొంగ రిసిప్ట్ లు తయారు చేసుకుని, ఫైనాన్స్ వారికి డబ్బులు చెల్లించకుండా నువ్వే దొంగ ముద్ర వేసుకొని కోట్లాది రూపాయలకు ఫైనాన్స్ కంపెనీలను చీట్ చేసిన నువ్వా ట్వీట్ చేసేది?’ అంటూ ప్రశ్నించారు.  

‘దళిత నాయకుడు, మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు. ఒకే నంబర్ పై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా! నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి వినే ధైర్యం నీకుందా?’ అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.  

More Telugu News