Andhra Pradesh: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ పెద్ద మనసు.. క్షతగాత్రులను దగ్గరుండి ఆసుపత్రికి తరలించిన మంత్రి!

  • ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘటన
  • కోటప్పకొండ వద్ద అదుపుతప్పిన బైక్
  • జంటను దగ్గరుండి ఆసుపత్రికి పంపిన సురేష్

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పెద్దమనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ జంటను గమనించిన మంత్రి దగ్గరుండి వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో ఈరోజు చోటుచేసుకుంది. జిల్లాలోని కోటప్పకొండ సమీపంలో ఓ జంట బైక్ పై వెళుతుండగా, వాహనం అదుపుతప్పి పడిపోయింది.

ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. అప్పుడే అటువైపుగా వెళుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రమాదాన్ని గమనించి తన వాహనాన్ని ఆపారు. క్షతగాత్రులను దగ్గరుండి 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, దంపతుల పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు. మరోవైపు ప్రమాదం విషయంలో మంత్రి స్పందించిన తీరుపై స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

More Telugu News