BCCI: గెలిచినప్పుడు రివార్డులు తీసుకునే సెలక్టర్లు ఓడినప్పుడు బాధ్యత కూడా తీసుకోవాలి: బీసీసీఐ

  • వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ ఓటమి
  • సెలక్టర్లపై బీసీసీఐ అసంతృప్తి 
  • ఎమ్మెస్కే ప్రసాద్ కు అవగాహన లేదన్న బీసీసీఐ అధికారి

వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియా అనూహ్య ఓటమి పట్ల బీసీసీఐ వర్గాలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పుడు ఓటమిపాలైనా ఆటగాళ్లనే బాధ్యుల్ని చేస్తున్నారని, సిరీస్ విజయాలు, టోర్నమెంట్ టైటిళ్లు సాధించినప్పుడు నజరానాలు అందుకునే సెలక్టర్లు, జట్టు ఓడినప్పుడు కూడా బాధ్యత తీసుకోవాలని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఎప్పుడూ జట్టు వెంటే ఉంటాడని, కానీ నాలుగో నంబర్ ఆటగాడిగా ఎవర్ని తీసుకోవాలన్నదానిపై అవగాహన లేకుండా పోయిందని ఓ బీసీసీఐ అధికారి విమర్శించారు.

వరల్డ్ కప్ కోసం ప్రాబబుల్స్ ఎంపిక నుంచి నిన్నమొన్నటి మార్పులు చేర్పుల వరకు అన్ని నిర్ణయాలు సెలక్షన్ కమిటీనే తీసుకుందని, జట్టు అవసరాలకు అనుగుణంగా కాకుండా, అవగాహనాలోపంతో తీసుకున్న ఆ నిర్ణయాలే జట్టు ఓటమికి కారణమయ్యాయని, ప్రపంచకప్ లో టీమిండియా ఓటమికి సెలక్షన్ కమిటీ సభ్యులే బాధ్యత తీసుకోవాలని ఆ అధికారి స్పష్టం చేశారు. ప్రపంచకప్ లాంటి అత్యున్నత ఈవెంట్ కు నాలుగో నంబర్ ఆటగాడ్ని ఎంపిక చేయలేకపోయారంటే అది సెలక్టర్ల అసమర్థతేనని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.

More Telugu News