Andhra Pradesh: చంద్రబాబు ఏపీని అభివృద్ధి పథంలో నడిపితే.. మీరు 16 నెలలు జైలులో కూర్చున్నారు!: విజయసాయిరెడ్డికి బుద్ధా కౌంటర్

  • విమర్శించడానికి నోరొక్కటే సరిపోదు.. అర్హత ఉండాలి
  • విజయసాయిరెడ్డి ప్రధానమైన అర్హత కాళ్లపై పడటమే
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన టీడీపీ ఎమ్మెల్సీ

టీడీపీ అధినేత చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఏపీ ప్రజలకు ఉపయోగపడలేదని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తన కుటుంబ సభ్యుల ఆస్తులను లక్షల కోట్లకు పెంచుకున్నారని దుయ్యబట్టారు. అసలు ప్రజలకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను టీడీపీ నేత బుద్ధా వెంకన్న తిప్పికొట్టారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో ఏపీని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత చంద్రబాబుదని వెంకన్న తెలిపారు.

అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేసిన అవినీతికి 16 నెలలు జైలులో కూర్చున్న ఘనత విజయసాయిరెడ్డిదని ఎద్దేవా చేశారు. విమర్శించడానికి నోరు ఒక్కటే ఉంటే సరిపోదనీ, అర్హత కూడా ఉండాలని విజయసాయిరెడ్డికి హితవు పలికారు. విజయసాయిరెడ్డికి ఉన్న ప్రధాన అర్హత కాళ్లమీద పడటమేనని చురకలంటించారు. గుర్తింపు కోసం అడుక్కునేవాడు అథమస్థాయి బిచ్చగాడనీ, దీనికి విజయసాయిరెడ్డే పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో స్పందించారు.

More Telugu News