jagan: వైసీపీ దౌర్జన్యాలకు నేనో బాధితుడిని : మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌

  • స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో మాపై తప్పుడు కేసులు
  • ముఖ్యమంత్రి జగన్‌ తీరు సరిగా లేదు
  • ఈ ప్రభుత్వం హయాంలో పెట్టుబడులు రావు

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యాల్లో తానో బాధితుడినని మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగా పోలీసులు తమపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమను పలు రూపాల్లో మోసం చేశారంటూ ఇటీవల కాలంలో కోడెల శివప్రసాద్‌, ఆయన కొడుకు, కూతురుపై వరుస కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. నిన్న కూడా తమ వద్ద ఏడు లక్షలు తీసుకుని మోసగించారంటూ ఓ వర్గం కోడెల ఇంటి ముదు బైఠాయించి నిరసన తెలిపారు. ఈనేపథ్యంలో ఈరోజు కోడెల గుంటూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వై.ఎస్‌.జగన్‌ ప్రభుత్వం తీరు సరిగా లేదన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం లేదని, ఇలా వ్యవహరిస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవరూ ముందుకు రారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారంటూ పదేపదే సీఎం జగన్‌ వ్యాఖ్యానించడం కూడా సరికాదన్నారు.

More Telugu News