Tamilnadu: మూడు భాషలను నేర్చుకోవాలని విద్యార్థులను ఒత్తిడి చేయడం సరికాదు!: హీరో సూర్య

  • జాతీయ విద్యావిధానం ముసాయిదాపై స్పందించిన నటుడు
  • చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా టీచర్లు లేరని వ్యాఖ్య
  • అందరికీ సమాన అవకాశం లేకపోతే నీట్ ఉత్తీర్ణత ఎలా?

కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ విద్యావిధానం-2019 ముసాయిదాను విడుదల చేసింది. ఇందులో భాగంగా హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో ప్రాథమిక పాఠశాల స్థాయిలో హిందీని కచ్చితంగా అమలు చేయాలని సిఫార్సు చేసింది. దీనిపై తమిళనాడులోని రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నిబంధనను ఎత్తివేసింది. తాజాగా ఈ వివాదంపై తమిళ హీరో సూర్య స్పందించాడు. ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే పిల్లలు మూడు భాషలు(మాతృభాష-ఇంగ్లిష్-హిందీ) నేర్చుకోవాలని ఒత్తిడి చేయడం సరికాదని సూర్య తెలిపాడు.

పిల్లలకు చదువు నేర్పించడం తనకే కష్టంగా ఉందని సూర్య వ్యాఖ్యానించాడు. దేశంలో చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ టీచర్లు లేరనీ, ఇది దారుణమని అన్నాడు. అందరికీ సమానమైన అవకాశాలు లేనప్పుడు జాతీయ వైద్య విద్య ప్రవేశ పరీక్ష(నీట్)లో ఉత్తీర్ణత శాతం ఎలా ఉంటుందని ప్రశ్నించాడు.

ఇకపై ప్రభుత్వ పాఠశాలల కంటే కోచింగ్ సెంటర్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుందని స్పష్టం చేశాడు. కేంద్రం తెచ్చిన నూతన విద్యావిధానం ముసాయిదాపై అందరూ స్పందించాలని సూర్య విజ్ఞప్తి చేశాడు. లేదంటే గ్రామీణ విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోతాయని హెచ్చరించాడు.

More Telugu News