Jayalakshmi: ఆత్మహత్యాయత్నం చేసిన టీడీపీ మహిళా కార్యకర్త!

  • ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న జయలక్ష్మి
  • సెక్యూరిటీ ఉద్యోగం కూడా చేస్తుండటంతో ఒకటి వదులుకోవాలని హెచ్చరిక
  • నిద్రమాత్రలు మింగిన జయలక్ష్మి

మచిలీపట్నంలో ఆశా కార్యకర్తగా పని చేస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరురాలు జయలక్ష్మి అత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, 2014 మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆమె, ఆపై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ ఉద్యోగాన్ని సంపాదించింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైన తరువాత ఆమె రెండు ఉద్యోగాలపై పలువురు ఫిర్యాదులు చేయడంతో, ఆసుపత్రి ఉన్నతాధికారులు ఏదో ఓ ఉద్యోగాన్ని వదులుకోవాలని హెచ్చరించారు.

దీంతో సెక్యూరిటీ గార్డు ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె, ప్రభుత్వం మారడంతో ఆశా కార్యకర్త ఉద్యోగం కూడా పోతుందన్న మనస్తాపంతో నిన్న మధ్యాహ్నం నిద్ర మాత్రలు మింగింది. విషయాన్ని గమనించిన కుటుంబీకులు, ఆమెను పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పలువురు టీడీపీ నేతలు ఆమెను పరామర్శించారు.

More Telugu News