Anchor Swetha Reddy: బిగ్ బాస్-3 నిర్వాహకులపై పోలీసులను ఆశ్రయించిన యాంకర్ శ్వేతారెడ్డి!

  • బిగ్ బాస్ షోకి సెలక్ట్ చేసి ఒప్పంద పత్రం ఇవ్వడంలేదని ఆగ్రహం
  • బిగ్ బాస్ ను 'ఇంప్రెస్' చేయాలంటున్నారని ఫిర్యాదు
  • దారుణంగా మాట్లాడారంటూ ప్రోగామ్ ఇన్ చార్జ్ పై మండిపాటు

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్ మూడో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. బిగ్ బాస్-3కి అగ్రహీరో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ బిగ్గెస్ట్ రియాల్టీ షోలో పాల్గొనే సెలబ్రిటీల జాబితా వెల్లడించనున్నారు. అయితే, ప్రముఖ తెలుగు యాంకర్ శ్వేతారెడ్డి బిగ్ బాస్ నిర్వాహకులపై మండిపడుతున్నారు. బిగ్ బాస్-3ని నిషేధించాలని డిమాండ్ చేశారు. తనను బిగ్ బాస్-3కి ఎంపిక చేసినా, ఇప్పటివరకు అగ్రిమెంట్ పత్రాలు ఇవ్వడంలేదని ఆమె ఆరోపించారు.

బిగ్ బాస్ షోలో అడుగుపెట్టాలంటే బిగ్ బాస్ ను 'ఇంప్రెస్' చేయాల్సి ఉంటుందని, అందుకే మీరేం చేస్తారు? అంటూ పోగ్రామ్ ఇన్ చార్జ్ దారుణంగా మాట్లాడాడని, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్వేతారెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు బిగ్ బాస్ నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. ఇటీవలే శ్వేతారెడ్డి ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ ను వేశ్యాగృహంతో పోల్చిన సంగతి తెలిసిందే.

More Telugu News