visakhapatnam: విశాఖలో మెట్రో రైలు ప్రతిపాదన పక్కకు... మోనో రైలు తెరపైకి

  • వైసీపీ ప్రభుత్వం తాజా నిర్ణయం
  • తొలి బడ్జెట్‌లో దీని ప్రస్తావన
  • మోనో రైలు వ్యయం కూడా తక్కువ

నవ్యాంధ్రలో అతి పెద్ద నగరం, ఆర్థిక రాజధానిగా గుర్తింపు ఉన్న విశాఖలో మోనో రైలు ప్రాజెక్టు చేపట్టాలని వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. నగరవాసుల రవాణా అవసరాల కోసం విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు అమలు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. నగరంలోని ముఖ్యప్రాంతాలను కలుపుతూ మొత్తం 42.55 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు లైన్‌ నిర్మించాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ప్రధానమైనది 30.38 కిలోమీటర్ల పొడవు ఉన్న గాజువాక-కొమ్మాది మార్గం కాగా, దీనికి అనుసంధానిస్తూ 5.25 కిలోమీటర్ల పొడవున గురుద్వారా-పాతపోస్టాఫీసు లైను, 6.91 కిలోమీటర్ల పొడవున తాటిచెట్లపాలెం-చినవాల్తేరు లైను నిర్మించాలని నిర్ణయించారు.

ఇందుకు 8,300 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. టెండర్ల వరకు ప్రక్రియ వచ్చేసరికి రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం తొలుత భూగర్భ మెట్రో రైలు నిర్మాణ ఆలోచన చేసింది. ఇందుకు అదనంగా మరో 1500 కోట్లు ఖర్చవుతుందని కూడా అంచనా వేశారు.

తాజాగా మోనో రైలుకు బడ్జెట్‌లో ప్రతిపాదన చేశారు. అత్యాధునిక ఫ్యాబ్రికేటెడ్‌ సింగిల్‌ బీమ్‌ ద్వారా నడిచే మోనో రైలు వ్యవస్థ ప్రపంచంలో ఎప్పటి నుంచో ఉంది. మెట్రో రైలుతో పోల్చుకుంటే మోనో రైలు ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా తక్కువ. అందువల్ల వైసీపీ ప్రభుత్వం తాజా ప్రతిపాదన చేసినట్లు భావిస్తున్నారు.

More Telugu News