Andhra Pradesh: కోడెల కుమార్తె విజయలక్ష్మిపై చీటింగ్, ఎస్సీ,ఎస్టీ కేసు.. తీర్పును రిజర్వులో ఉంచిన ఏపీ హైకోర్టు!

  • విజయలక్ష్మిపై చీటింగ్, ఎస్సీ-ఎస్టీ కేసు పెట్టిన వెంకాయమ్మ
  • తనను సివిల్ వివాదంలోకి లాగారన్న విజయలక్ష్మి
  • ఆమెపై ఇప్పటికే 15 కేసులు ఉన్నాయన్న వెంకాయమ్మ

నరసరావుపేటలో వెంకాయమ్మ అనే మహిళ తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమార్తె విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా విజయలక్ష్మి తరఫు న్యాయవాది వాదిస్తూ..‘2014లో జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు విజయలక్ష్మిపై కేసు నమోదు చేశారు. మొత్తం 8 మంది నిందితులు ఉండగా, ఆమెను ఏ2గా చేర్చారు. విజయలక్ష్మికి సంబంధం లేకపోయినా ఈ సివిల్ వివాదంలోకి ఆమెను లాగారు.కాబట్టి దయచేసి నా క్లయింట్ పై నమోదుచేసిన చీటింగ్, ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేయండి’ అని కోరారు.

 మరోవైపు వెంకాయమ్మ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. శివప్రసాద్ రావు కుమార్తె విజయలక్ష్మిపై  ఇప్పటికే 15 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. అప్పట్లో తాము పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అడ్డుకున్నారని చెప్పారు. కాబట్టి కేసును కొట్టివేయరాదని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.

More Telugu News