pregnent: ఆసుపత్రిలో ఆయాల అత్యుత్సాహం...ప్రసవానికి ప్రయత్నించగా బిడ్డ మృతి

  • పురిటినొప్పులతో మహిళ రాగా ఆపరేషన్‌ థియేటర్‌కు తరలింపు
  • అన్నీఅయ్యాక వచ్చిన వైద్యుడు
  • బిడ్డ చనిపోయిట్లు చెప్పడంతో వివాదం

 ఓ ఆసుపత్రి ఆయాల నిర్వాకం పండంటి బిడ్డ ప్రాణాలను బలిగొంది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడంటూ బాధిత కుటుంబ సభ్యులు గొడవ చేయడంతో ఈ విషయం బయటకు తెలిసింది.

వివరాల్లోకి వెళితే...రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి నిన్నరాత్రి పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను ఆమె కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. ఆ సమయానికి వైద్యుడు లేడు. దీంతో ఆయాలు గర్భిణిని ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకువెళ్లి ప్రసవం చేయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మగశిశువు ఊపిరాడక చనిపోయాడు.

వైద్యుడు చివరి క్షణంలో వచ్చి శిశువు మృతి చెందిన విషయం చెప్పడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బిడ్డ ప్రాణాలు పోయాయంటూ ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. జిల్లా వైద్యాధికారికి సమస్య చెప్పి న్యాయం జరిపిస్తామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.

More Telugu News