Tamilnadu: బీఫ్ తో చేసిన సూప్ తాగాడని యువకుడిపై దాడి!

  • వ్యక్తిని దారుణంగా కొట్టిన హిందూ మక్కల్ కట్చి సభ్యులు
  • బాధితుడికి తీవ్రగాయాలు
  • నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఈ మధ్య కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో గొడ్డు మాంసం వివాదాలకు కారణమవుతోంది. కొన్ని ఘటనల్లో వ్యక్తుల ప్రాణాలు పోవడానికి కూడా పశుమాంసమే కేంద్రబిందువు. తాజాగా, తమిళనాడులో బీఫ్ తో చేసిన సూప్ తాగాడని ఓ వ్యక్తిని పట్టుకుని కుళ్లబొడిచారు. నాగపట్నంలోని బొరవచేరి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫైజాన్ అనే యువకుడు బీఫ్ సూప్ తాగుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్టుతో హిందుత్వ వాదులు రగిలిపోయారు.

హిందూ మక్కల్ కట్చి అనే అతివాద గ్రూపు సభ్యులు మహ్మద్ ఫైజాన్ ఇంటికి వెళ్లి అతడిపై ఇనుపరాడ్లతో విచక్షణరహితంగా దాడిచేశారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. తీవ్రగాయాల పాలైన ఫైజాన్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి హత్యాయత్నం ఆరోపణలు మోపారు. ఉత్తరాది భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించే తమిళనాడులో ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

More Telugu News