Uttar Pradesh: విధుల్లో నిర్లక్ష్యం.. 81 మంది పోలీసులను ఇంటికి పంపిన యూపీ ప్రభుత్వం!

  • పోలీసులకు నిర్బంధ రిటైర్మెంట్ అమలు
  • యూపీ సీఎం యోగి ఆదేశాలతో స్క్రీనింగ్ కమిటీ చర్యలు
  • 3 నెలల వేతనం ఇచ్చి విధుల నుంచి తొలగింపు

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న పోలీస్ అధికారులపై ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ కొరడా ఝుళిపించింది. ఐజీ, ఎస్పీ, ఇన్ స్పెక్టర్, సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్ హోదాల్లో పనిచేస్తున్న 81 మంది పోలీసు ఉద్యోగులకు నిర్బంధ పదవీవిరమణ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం నియమించిన స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వీరందరికీ 3 నెలల వేతనం ఇచ్చిన కమిటీ ఇంటికి సాగనంపింది.

ఉత్తరప్రదేశ్ లో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసులను తప్పిస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గతంలోనే హెచ్చరించారు. ఇందులో భాగంగానే ఆయన 50 ఏళ్లకు పైబడి, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసులను తప్పించాలని ఆదేశించారు.

ఈ విషయమై స్క్రీనింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. విధులను సరిగ్గా నిర్వర్తించని 50 ఏళ్లలోపు అధికారులకు కూడా నిర్బంధ రిటైర్మెంట్ ను అమలు చేస్తామని తెలిపారు. ఇక శారీరక వైకల్యంతో బాధపడుతున్న అధికారులకు వైద్యపరీక్షలు నిర్వహించి దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

More Telugu News