Telangana: తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి ఇంట్లోకి తాచుపాము... వెళ్లి పట్టుకున్న హోమ్ శాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది!

  • ప్రశాసన్ నగర్ లో ఉన్నతాధికారుల నివాసాలు
  • పామును చూసి భయపడిన ప్రజలు
  • చాకచక్యంగా బంధించిన రాజీవ్ త్రివేది

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఇంట్లోకి ఓ తాచుపాము రాగా, విషయం తెలుసుకున్న హోమ్ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజీవ్‌ త్రివేది వెళ్లి, దాన్ని అత్యంత చాకచక్యంగా బంధించారు. నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, హైదరాబాద్, జూబ్లీహిల్స్, ప్రశాసన్‌ నగర్‌ లోని ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ లో ఎస్కే జోషితో పాటు పలువురు అధికారులు నివాసం ఉంటున్నారు. ఆ ప్రాంతంలో గుట్టలు, చెట్లు, చిన్న చిన్న నీటి కుంటలు అధికంగా ఉండటంతో తరచూ విష సర్పాలు వస్తూనే ఉంటాయి.

ఈ క్రమంలో ఎస్కే జోషి నివాసం వెనుక ఉన్న స్థలంలోకి ఓ పాము వచ్చి చేరింది. పడగ విప్పి బుసకొడుతున్న దాన్ని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈలోగా విషయం తెలుసుకున్న రాజీవ్‌ త్రివేది అక్కడకు వచ్చారు. తన వద్ద ఉన్న ఓ పరికరంతో పామును బంధించి, ప్లాస్టిక్‌ డబ్బాలోకి పంపించారు. దానికి ఎటువంటి హానీ తలపెట్టకుండా, దూరంగా వదిలి పెట్టిస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

More Telugu News