Bigg Boss: 'బిగ్ బాస్' ముసుగులో బ్రోతల్ హౌస్... యాంకర్‌ శ్వేతారెడ్డి సంచలన ఆరోపణలు!

  • తొలుత నన్ను ఎంపిక చేశారు
  • ఆపై కమిట్ మెంట్ అడిగారు
  • కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలి
  • ప్రెస్ క్లబ్ లో శ్వేతారెడ్డి

బిగ్ బాస్ సీజన్-3లో పాల్గొనేందుకు తనను ఎంపిక చేసి, ఆపై కోరిక తీర్చాలని కోరారని, బిగ్ బాస్ ను ఇంప్రెస్ చేస్తేనే అవకాశం లభిస్తుందని చెప్పారని, హౌస్ పేరిట బ్రోతల్ హౌస్ నడుస్తోందని యాంకర్, జర్నలిస్ట్ శ్వేతారెడ్డి సంచలన విమర్శలు చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆమె, క్యాస్టింగ్ కౌచ్ కి బిగ్ బాస్ కేంద్రంగా మారిందన్నారు. వెంటనే తెలుగు టీవీ నుంచి ఆ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలని, బిగ్‌ బాస్‌ ముసుగులో జరుగుతున్న వాటిని బయటపెట్టడానికే తాను మీడియా ముందుకు ధైర్యంగా వచ్చానని అన్నారు.

గత ఏప్రిల్‌ లో తనకు ఫోన్‌ వచ్చిందని, బిగ్‌ బాస్‌ మూడవ సీజన్ కు ఎంపిక చేశామని చెప్పారని, ఎందుకని అడిగితే, పాప్యులర్‌ యాంకర్‌ కాబట్టి తీసుకున్నామని అన్నారని, ఆపై కార్యక్రమ సమన్వయకర్త రవికాంత్‌ తనకు పలుమార్లు ఫోన్ చేసి, పిలిపించి మాట్లాడారని, ఒప్పందంపై తాను సంతకాలు కూడా చేశానని శ్వేతారెడ్డి తెలిపారు. వాటి జిరాక్స్‌ లు తనకు ఇవ్వలేదని, ఆరోపించారు.  ఆపై తమ బాస్‌ ను ఇంప్రెస్‌ చేయాలని కార్యక్రమ ప్రొడ్యూసర్‌ శ్యామ్‌ తనను అడిగారని, తానెందుకు ఇంప్రెస్‌ చెయ్యాలని నిలదీశానని, కమిట్‌మెంట్‌ కావాలని వారు అడిగారని, మహిళల ఆత్మగౌరవానికి ఈ కార్యక్రమం భంగం కలిగిస్తోందని శ్వేతారెడ్డి ఆరోపించారు.

తనలాగే బయటకు వచ్చి బిగ్ బాస్ పేరిట జరుగుతున్న బాగోతంపై మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని, కొంత మంది బాధితులు తనకు ఫోన్‌ చేస్తున్నారని ఆమె అన్నారు. హౌస్ లోకి కంటెస్టెంట్ గా రావాలని తనకు ఫోన్ల మీద ఫోన్లు చేసిన రఘు, రవికాంత్‌, శ్యామ్‌ ఇప్పుడు స్పందించడం లేదని అన్నారు.

More Telugu News