Kerala: కేరళలో జైలు బిర్యానీ... స్విగ్గీలో ఆర్డర్ చేస్తే మీ ఇంటికి!

  • కేరళ వియ్యూర్ జైల్లో బిర్యానీ తయారీ
  • స్విగ్గీతో ఒప్పందం కుదుర్చుకున్న జైలు అధికారులు
  • కాంబో ప్యాక్ లో డెలివరీ

ఇటీవల కాలంలో జైళ్లలో సంస్కరణల్లో భాగంగా ఖైదీలతో బేకరీ ఐటమ్స్ తయారు చేయించడం, పెట్రోల్ బంకులు నిర్వహణ, వ్యవసాయం చేయించడం అందరికీ తెలిసిందే. అయితే, కేరళలోని వియ్యూర్ జైలు అధికారులు కాస్త భిన్నంగా ఆలోచించి ఖైదీలతో దమ్ బిర్యానీ తయారుచేయించి విక్రయించాలని నిర్ణయించారు. అంతేకాదు, ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ సంస్థ స్విగ్గీతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. గురువారం నుంచే అమ్మకాలు కూడా మొదలయ్యాయి. వియ్యూర్ జైలు ఖైదీలు ప్రస్తుతానికి చికెన్ బిర్యానీ మాత్రమే తయారుచేస్తున్నారు.

ఇది కాంబో ప్యాక్ లో లభ్యమవుతుంది. ప్లేటు ధర రూ.127గా నిర్ణయించారు. క్యాంబో ప్యాక్ స్పెషాలిటీ ఏంటంటే, ఇందులో 300 గ్రాముల బిర్యానీ రైస్, ఓ చికెన్ లెగ్ పీస్, 3 చపాతీలు, ఓ కప్ కేక్, సలాడ్, రైతా, ఒక వాటర్ బాటిల్ అందిస్తారు. ప్రారంభ దశ కాబట్టి జైలుకు 6 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే విక్రయించనున్నారు. ఇక్కడి ఖైదీలు తయారుచేస్తున్న ఈ రుచికరమైన బిర్యానీని ఫ్రీడం ఫుడ్ ఫ్యాక్టరీ తరఫున మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కారాగారంలో పాతికవేల చపాతీలు, 500 ప్లేట్ల బిర్యానీ తయారు చేస్తున్నారు.

More Telugu News