Chandrababu: గ్రామ వలంటీర్ల విధానమే భవిష్యత్ లో జగన్ ఓటమికి కారణమవుతుంది: మాణిక్యాలరావు

  • చంద్రబాబుకు పట్టిన గతే జగన్ కూ పడుతుంది
  • చంద్రబాబు విధానాలనే జగన్ అనుసరిస్తున్నారు
  • టీడీపీ మునిగిపోతున్న నావ

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర ఇన్ చార్జ్, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు. ఉత్తరాంధ్రలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, గ్రామ వలంటీర్ల విధానం సరైంది కాదని, భవిష్యత్ లో జగన్ ఓటమికి గ్రామ వలంటీర్ల విధానమే కారణంగా నిలుస్తుందని అన్నారు. చంద్రబాబు ఓడిపోయింది జన్మభూమి కమిటీల కారణంగానే అని, మున్ముందు జగన్ కు కూడా అదే గతి పడుతుందని మాణిక్యాలరావు హెచ్చరించారు. చంద్రబాబు విధానాలనే జగన్ కూడా అనుసరిస్తున్నారని విమర్శించారు.

టీడీపీ మునిగిపోతున్న నావ అని, అందుకే టీడీపీ నుంచి బీజేపీలోకి భారీగా వలసలు సాగుతున్నాయని చెప్పారు. గతంలో కేంద్రం నుంచి నిధులు వచ్చినా, రాలేదంటూ చంద్రబాబు అసత్య ప్రచారం చేశారని, దేశవ్యాప్తంగా తిరిగి ప్రచారం చేసినా ఎవరూ చంద్రబాబు మాటలు నమ్మలేదని మాణిక్యాలరావు వ్యాఖ్యానించారు. కేంద్రం ఇచ్చిన నిధులతో కాకుండా, చంద్రన్న బీమా పథకం ఏ నిధులతో అమలు చేశారో చెప్పాలని నిలదీశారు.

More Telugu News