India: ఓ 45 నిమిషాల చెత్త ఆట మమ్మల్ని టోర్నమెంట్ నుంచి గెంటేసింది: కోహ్లీ

  • సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్
  • ధోనీ రనౌట్ తో పరిస్థితి మారిపోయిందన్న కోహ్లీ
  • ఈ ఓటమిని భరించడం కష్టమేనన్న భారత సారథి

మాంచెస్టర్ లో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్లో 18 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓడిపోవడం పట్ల టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. లక్ష్యఛేదన ఆరంభంలో తాము ఓ 45 నిమిషాల పాటు చెత్తగా ఆడామని, అదే తమ కొంప ముంచిందని కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడుతూ, ఓటమి బాధను భరించలేకపోతున్నామని, కానీ ఈ విజయానికి న్యూజిలాండ్ అన్ని విధాలుగా అర్హురాలని అభిప్రాయపడ్డాడు.

కొన్ని కీలక సమయాల్లో న్యూజిలాండ్ చూపించిన తెగువ వారిని గెలుపు తీరాలకు చేర్చిందని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ పోరులో తమ షాట్ సెలక్షన్ చాలా పేలవంగా ఉందని, పిచ్ ను బాగా ఉపయోగించుకున్న కివీస్ బౌలర్లు స్వింగ్ తో తమను దెబ్బకొట్టారని అంగీకరించాడు. గత రెండు మ్యాచ్ ల్లో రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించాడని, ధోనీ అతడితో మంచి భాగస్వామ్యం నెలకొల్పినా, చివర్లో ధోనీ రనౌట్ తో పరిస్థితి మారిపోయిందని కోహ్లీ వివరించాడు. జడేజా దూకుడుతో తన ఉద్దేశాన్ని స్పష్టంగా చాటాడని, కానీ, న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబర్చారని కోహ్లీ పేర్కొన్నాడు.

More Telugu News