Hyderabad: నీళ్ల ట్యాంకులో కుళ్లిపోయిన మృతదేహం!

  • దుర్వాసన వస్తోందంటూ సమాచారమిచ్చిన స్థానికులు
  • మృతదేహానికి సంబంధించి లభించని ఆధారాలు
  • గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు

తాము నివసిస్తున్న ప్రదేశంలో దుర్వాసన వస్తోందంటూ కొందరి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి చూసి అవాక్కయ్యారు. హైదరాబాద్, పహడిషరీఫ్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి గ్రామ ఇండస్ట్రియల్ ప్రాంత వాసులు, తమ ప్రాంతంలో దుర్వాసన వస్తోందంటూ పోలీసులకు సమాచారమిచ్చారు.

దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు సిమెంట్ రింగులతో నిర్మించి ఉన్న పాత నీటి ట్యాంకులో మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. మృతదేహానికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదు. విషయం తెలుసుకున్న ఎల్బీ నగర్ డీసీపీ సన్‌ప్రత్ సింగ్, వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఆధారాలేమీ లభించకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసినట్టు డీసీపీ సన్ ప్రీత్ తెలిపారు.

More Telugu News