Karnataka: కర్ణాటక సంక్షోభం.. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకేకు షాకిచ్చిన ముంబై పోలీసులు!

  • కుమారస్వామి, డీకే నుంచి తమకు ముప్పు ఉందన్న ఎమ్మెల్యేలు
  • హోటల్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
  • డీకేను హోటల్‌లోకి అనుమతించేది లేదన్న పోలీసులు

కర్ణాటక సంక్షోభానికి ఇప్పట్లో శుభంకార్డు పడేలా కనిపించడం లేదు. ముంబైలోని ఓ హోటల్‌లో బస చేసిన రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు ముంబై వెళ్లిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మంత్రి డీకే శివకుమార్‌కు ముంబై పోలీసులు షాకిచ్చారు. హోటల్‌లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు భారీగా మోహరించారు. దీంతో వారితో చర్చలు జరిపి సంక్షోభానికి ముగింపు పలకాలన్న ఆయన అశలు అడియాసలైనట్టే కనిపిస్తున్నాయి. మరోవైపు, తమకు ముఖ్యమంత్రి కుమారస్వామిని కానీ, డీకేను కానీ కలిసే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన రెబల్ ఎమ్మెల్యేలు.. తమకు మరింత భద్రత కల్పించాలని కోరారు. దీంతో తమకు అదనపు సెక్యూరిటీ కావాలంటూ ముంబై పోలీస్ కమిషనర్‌కు హోటల్ యాజమాన్యం లేఖ రాసింది.

తాము పదిమందీ హోటల్‌ రెనైసెన్స్ పొవాయ్ హోటల్‌లో ఉన్నామని, సీఎం కుమారస్వామి, మంత్రి డీకే శివకుమార్‌లు హోటల్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసిందని  రెబల్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. వారి నుంచి తమకు ముప్పు ఉందని, వారిని హోటల్ ఆవరణలోకి అనుమతించవద్దని ఆ లేఖలో కోరుతూ ఎమ్మెల్యేలు అందరూ సంతకాలు చేశారు. స్పందించిన డీసీపీ మహారాష్ట్ర రిజర్వు పోలీస్ ఫోర్స్‌తోపాటు అల్లర్ల నియంత్రణ పోలీసులను హోటల్ వద్ద మొహరించారు. అదనపు పోలీస్ కమిషనర్ దిలీప్ సావంత్ కూడా హోటల్ వద్దకు చేరుకున్నారు. కాగా, రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు డీకే శివకుమార్ సహా ఎవరు వచ్చినా అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.

More Telugu News