Tollywood: అక్షరాలయ పాఠశాలను దత్తత తీసుకున్న సాయిధరమ్ తేజ్

  • మున్నిగూడలోని అక్షరాలయ స్కూలు చిన్నారుల బాగు కోసం కృషి
  • రెండేళ్లుగా ‘థింక్’ పీస్ సంస్థతో కలిసి పనిచేస్తున్న నటుడు
  • విరాళాలు సేకరించాలంటూ అభిమానులకు పిలుపు

టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయిధరమ్ తేజ్ ఓ పాఠశాలను దత్తత తీసుకున్నాడు. ఈ మేరకు మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. హైదరాబాద్, మున్నిగూడలోని అక్షరాలయ పాఠశాలను దత్తత తీసుకున్నానని, రెండేళ్లుగా వందమందికిపైగా పిల్లలకు పౌష్టికాహార సంబంధమైన అవసరాల కోసం సహాయం చేస్తున్నానని తెలిపాడు. ఇది తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందన్నాడు. చిన్నారుల్లో వెలుగులు నింపేందుకు విరాళాలు సేకరించాలని అభిమానులను కోరాడు.

తోచినంత సాయం చేయాలని అభ్యర్థించాడు. అలా చేస్తే ‘థింక్ పీస్’ సంస్థతో పాటు చిన్నారులు, తాను కూడా మీకు రుణపడి ఉంటామని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నట్టు తెలిపాడు. ఈ ఏడాది తాను మరో 50 మంది చిన్నారులను దత్తత తీసుకున్నట్టు తెలిపాడు.

ఇటీవల దివ్యాంగునికి క్రీడల్లో సాయం చేసిన సాయిధరమ్ తేజ్ తాజాగా స్కూలు పిల్లలను దత్తత తీసుకోవడంపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో చిరంజీవి హోస్టుగా వచ్చిన ‘మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు’ షోలో తనకు వ‌చ్చిన‌ డ‌బ్బును కూడా ఈ స్కూల్ కోస‌మే సాయిధరమ్ ఖర్చు చేయడం గమనార్హం.

More Telugu News