TRS: మేము అధికారంలో ఉంటే సంగారెడ్డికి క్షణాల్లో నీళ్లు తెచ్చేవాడిని: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

  • సంగారెడ్డిలో తీవ్ర నీటి ఎద్దడి 
  • గోదావరి నీటిని సంగారెడ్డికి తరలించాలి
  • సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రజలు తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందిపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సింగూరు డ్యామ్ ఎండిపోవడంతో నీటి ఎద్దడి నెలకొందని, గోదావరి నీటిని సంగారెడ్డికి తరలించాలని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ఓ లేఖ రాశారు. గోదావరి నదీ జలాలు తీసుకొచ్చి సంగారెడ్డి ప్రజల గొంతు తడపాలని డిమాండ్ చేశారు. తాగునీరు, సాగునీటి అవసరాలపై అవగాహనలేని నేతలు సంగారెడ్డిలో ఉండడం దురదృష్టకరమంటూ టీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఈ సందర్భంగా జగ్గారెడ్డి తిప్పికొట్టారు. ఎవరు కబ్జాలు చేశారో, ఎవరు ఎవరిని ముంచారో తెలుసుకునేందుకు చర్చకు సిద్ధంగా ఉన్నామని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సంగారెడ్డికి క్షణాల్లో నీళ్లు తెచ్చేవాడినని అన్నారు.

More Telugu News