Chandrababu: ఈ ప్రశ్నకు నా దగ్గర కూడా సమాధానం లేదు తమ్ముళ్లూ!: చంద్రబాబు

  • అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • తాడిపత్రిలో హత్యకు గురైన కార్యకర్త కుటుంబానికి పరామర్శ
  • ప్రసంగంలో నిప్పులు చెరిగిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తల దాడులకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాడిపత్రిలో హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యకర్తలపై దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

నేరాలు, ఘోరాలు, హత్యలను ప్రజలెవరూ అంగీకరించబోరని, తప్పుడు పరిపాలన చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అన్ని గ్రామాలు తిరిగి కార్యకర్తలను కాపాడుకుంటానన్న చంద్రబాబు, అవసరమైతే పరిస్థితులు చక్కబడే వరకు అక్కడే ఉంటానని చెప్పారు.

"మీ గ్రామంలో మీరు ఏకాకి కాదు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. మనది ఒక్క గ్రామానికే పరిమితమైన పార్టీ కాదు, రాష్ట్రం అంతటా ఉంటుంది. మీరు ఆత్మస్థయిర్యంతో ఉండాలి. ఎక్కడికి వెళ్లినా ఒక్కటే అడుగుతున్నారు, సార్ మేమంతా ఓట్లేశాం, ఆ ఓట్లు ఏమైపోయాయి అంటున్నారు. ఈ ప్రశ్నకు నా దగ్గర కూడా సమాధానం లేదు తమ్ముళ్లూ! దాడులు చేయడం తప్పు అన్న వాళ్లపైనా తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇదేమన్నా రౌడీరాజ్యం అనుకుంటున్నారా? ఇది ప్రజాస్వామ్యం కాదా? ఏమనుకుంటున్నారు మీరు? ప్రాణం పోయినా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం" అంటూ చంద్రబాబు ఆవేశపూరితంగా ప్రసంగించారు. 

More Telugu News