Andhra Pradesh: ‘హోటల్ గేట్ వే’కు వెళ్లిన ఏపీ సీఎం జగన్.. గవర్నర్ తో మర్యాదపూర్వకంగా భేటీ!

  • ఈరోజు విజయవాడకు చేరుకున్న గవర్నర్ నరసింహన్
  • రెండు గంటల పాటు చర్చలు జరిపిన ఏపీ ముఖ్యమంత్రి
  • బడ్జెట్ అంశాలు, విభజన హామీలు సహా ముఖ్యమైన అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. విజయవాడలో గవర్నర్ నరసింహన్ బస చేస్తున్న హోటల్ గేట్ వేకు వెళ్లిన సీఎం జగన్ దాదాపు 2 గంటల పాటు ఆయనతో భేటీ అయ్యారు. ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరుసటి రోజు అంటే జూలై 12న ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

ఈ నేపథ్యంలో గవర్నర్ ను ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, విభజన సమస్యలు, పోలవరం ప్రాజెక్టు సహా పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

ఈసారి రూ.2 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో బడ్జెట్ లో కేటాయింపులపై ముఖ్యమంత్రి నరసింహన్ తో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో జరిగిన చర్చల వివరాలను కూడా జగన్ గవర్నర్ తో పంచుకున్నట్లు సమాచారం.

More Telugu News