Haryana: హోం వర్క్ చూపించమన్న టీచర్.. కత్తితో పొడిచిన విద్యార్థి!

  • సెలవుల్లో హోం వర్క్ ఇచ్చిన టీచర్
  • సోమవారం స్కూలు ప్రారంభమైన వెంటనే ఘటన
  • కోలుకుంటున్న ఉపాధ్యాయురాలు

సెలవుల్లో ఇచ్చిన హోం వర్క్ చూపించమన్నందుకు ఇంగ్లిష్ టీచర్‌ను కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడో విద్యార్థి. హరియాణాలోని సోనిపట్‌లో ఉన్న శ్రీరాం కృష్ణ స్కూల్‌లో జరిగిందీ ఘటన. నెల రోజుల సెలవుల తర్వాత సోమవారం స్కూలు తిరిగి ప్రారంభమైంది.‌ సెలవులకు ముందు 11వ తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్ టీచర్ ముకేశ్ కుమారి (45) హోం వర్క్ ఇచ్చారు.

సోమవారం స్కూలు ప్రారంభమైన తర్వాత తానిచ్చిన హోం వర్క్ ఏ మేరకు పూర్తి చేశారో అడిగి తెలుసుకుంటుండగా ఓ విద్యార్థి ఆమెపై పదునైన ఆయుధంతో దాడిచేశాడు. ఆమె పొట్టలో పలుమార్లు విచక్షణ రహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన టీచర్‌ను తొలుత సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి కాన్పూరులోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ (పీజీఐ)కి తరలించారు.

ఉపాధ్యాయురాలిపై దాడిచేసిన విద్యార్థి పారిపోతుండగా మరో టీచర్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ వీరేంద్ర రావ్ తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు మాట్లాడుతూ.. హోం వర్క్ చూపించమని అడిగిన వెంటనే కత్తి తీసి తన కడుపులో పలుమార్లు పొడిచాడని పేర్కొన్నారు.  

More Telugu News