Telangana: తెలంగాణ సచివాలయంలోని కార్యాలయాలను బీఆర్ కే భవన్ కు తరలించాలని నిర్ణయం

  • అటవీశాఖ ‘అరణ్య భవన్’ లోకి
  • ఆర్ అండ్ బీ శాఖ ఎర్రమంజిల్ కు 
  • మిగిలిన శాఖలు బీఆర్ కే భవన్ కు తరలింపునకు నిర్ణయం

తెలంగాణ సచివాలయం తరలింపునకు రంగం సిద్ధమవుతోంది. సచివాలయంలోని కార్యాలయాలను బూర్గుల రామకృష్ణారావు భవన్ (బీఆర్ కే) కు తరలించాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది. మంత్రి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. సంబంధిత అంశాలపై చర్చించింది. ఈ సమావేశంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.

బీఆర్ కే భవన్ కనుక సరిపోకపోతే ఇక్కడికి సమీపంలోని ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు కొన్ని శాఖలు తరలించాలని నిర్ణయించింది. అటవీశాఖను అరణ్య భవన్ లోకి, ఆర్ అండ్ బీ శాఖను ఎర్రమంజిల్ కు, మిగిలిన శాఖలన్నింటిని బీఆర్ కే భవన్ కు తరలించనున్నారు. రెండు వారాల్లో తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.

సచివాలయం, అసెంబ్లీ భవనాల స్థితిగతులపై అధ్యయనానికి కమిటీ

తెలంగాణలో కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణ అంశాలపై మంత్రి వర్గ ఉపసంఘం సమీక్షించింది. సచివాలయం, అసెంబ్లీ భవనాల స్థితిగతులపై అధ్యయనానికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఇంజనీర్ ఇన్ చీఫ్ లతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్ అండ్ బీ అధికారి గణపతిరెడ్డి కన్వీనర్ గా వ్యవహరించనున్న ఈ కమిటీలో సభ్యులుగా రవీందర్ రావు, మురళీధర్, సత్యనారాయణరెడ్డి ఉన్నారు. ప్రస్తుత సచివాలయం, అసెంబ్లీ భవనాల స్థితిగతులపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది.

More Telugu News